వైసీపీ పైశాచికత్వం ఏమాత్రం తగ్గలేదు: ఎక్స్ లో మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం

––
ప్రజలు తిరస్కరించినా వైసీపీ తీరు మారలేదని, ఆ పార్టీ కార్యకర్తల పైశాచికత్వం తగ్గలేదని మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నంలో వైసీపీ కార్యకర్తల పిచ్చి చేష్టలకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేస్తూ లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ మాజీ మంత్రి జోగి రమేశ్‌ ఇంట్లో జరిగిన శుభకార్యానికి వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జోగి రమేశ్ నివాసం ఉన్న మార్గంలో వెళుతున్న ఓ బాలుడి సైకిల్‌ ను వైసీపీ కార్యకర్తలు లాక్కున్నారు.

సైకిల్‌ను గాల్లో తిప్పి.. నేలకేసి కొట్టి కాళ్లతో తొక్కుతూ పైశాచిక ఆనందం పొందారు. ఈ చర్యలతో భయపడిన బాలుడు ఏడుస్తున్నా వారు పట్టించుకోలేదు. సెల్ ఫోన్ కెమెరాలలో రికార్డు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను మంత్రి లోకేశ్ రీట్వీట్ చేస్తూ.. ‘‘అబ్బే.. వాళ్లేమీ మారలేదు. మారరు కూడా. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో కానీ ఆ పేరును సార్థకం చేసుకోవడానికి నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. అందుకే నాటికీ, నేటికీ, ఎప్పటికీ అదో సైకో పార్టీనే.. వాళ్ల నాయకుడు ఓ సైకో! ప్రజలు బుద్ధి చెప్పినా మారని వాళ్ల ఆలోచనలను, చిన్న పిల్లవాడి చేతి నుంచి సైకిల్ లాక్కొని దాన్ని తొక్కుతూ, విరగ్గొడుతూ చేస్తున్న వికృత చేష్టలను సమాజం మరింతగా అర్థం చేసుకోవాలని ఈ వీడియోను పోస్ట్‌ చేస్తున్నాను’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

Nara Lokesh
YSRCP
Andhra Pradesh Politics
Jogi Ramesh
Ibrahimpatnam
YS Jagan Mohan Reddy
Telugu Desam Party
Political Violence
Social Media Viral
AP Politics

More Telugu News